Friday, April 8, 2016

అస్తమించబోయే సూరీడు
తనచుట్టూ వున్న ఆకాశాన్ని
అంత అందమైన రంగుల చిత్రంగా
మలుచుకుని ఆ వర్ణ మహోదధిలో
తలస్నానం చేయాలని భావిస్తాడో
మొన్నటిదాకా అర్ధమయేదికాడు.సుమా!!
ఉదయించబోయే అందాల చందమామ

పండు వెన్నెలను పిండారబోసినట్లుగా
పరిచి ఆనందాన్ని ఆ ముఖమ్మల్ తివాసీపై
నడిపించుకుంటూ ఎందుకిలా భువికి చేరుకుంటాడోకూడా
అంత తొందరగా నా చిట్టిబుర్రకు తట్టేదికూడాకాదు..


ప్రాచీన సాహిత్య పరంగా  యే కావ్యాన్ని చదివినా
అష్టాదశవర్ణాలతో కావ్యాన్ని అలా
ప్రబంధపు బిగి కౌగిలిలోకి చదువరికి
ఊపిరాడకుండా చేస్తుండే వారోకూడా
ఎన్ని సార్లు వల్లెవేసినా అంత
 సులుసూత్రంగా అర్ధమయేదికాదు--

భావకవితా సీమలో ఊహా ప్రేయసికోసం
పగలైనా,రాత్రయినా అలా పరవశించిపోతూ
పల్లవించడానికి సమాయత్తమై చివురుజొంపాలకు
గట్టిగా కట్టిన ఊయలలో ఊగే కన్నెపిల్లలా
కోయిలమ్మ గీతికలా మృధు మధుర స్వరమై
గానలహరిలో మునుగుతూ తేలుతూ ఆనంద వార్ధిలో
అమందానంద కందళిత హృదయారవిందులౌతుంటారో
ఎంతగా ఆలోచించినా ఒక పట్టాన  అవగతమయేది కాదు..

ఇవన్నీ మధుకీలలనంటుకున్న ప్రణయ వాతూలహతిన
గాఢంగా తనను పదారణాలా  విశ్వసించిన అమాయకులైన
అజ్ఞానంపు  మానవాళిని బడద్రోయు మార్గమని గుర్తెరిగి మౌన స్వామినై
నిశ్శబ్దములైన నిముషములవేగాని వేరుగాదని  నెమ్మదితో తెలుసుకొంటి....
ఇక ప్రవాసమే ప్రల్లదులపాలిటి స్వర్గ సీమయని చాటుచుంటి..

No comments:

Post a Comment